ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్కార్ బడి గురించి ఓవైపు గొప్పగా చెబుతుంటే.. ఈ ‘సారు’ను చూశారా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 22, 2024, 07:33 PM

పాఠశాలకు వస్తూ ఫూటుగా తాగిన ఉపాధ్యాయుడు ‘బడి’ బయటే పడిపోయాడు. మత్తులో పడి, రోడ్డుపై దొర్లుతున్న ఉపాధ్యాయుడిని స్థానికులు గమనించి పక్కనే ఉన్న పశువుల కొట్టంలోకి ఈడ్చుకెళ్లారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తిమ్మంపేట పంచాయితీ రాజీవ్ నగర్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పత్తిపాటి వీరయ్య రోజూ మద్యం తాగి వస్తాడని గ్రామస్థులు, విద్యార్థులు చెబుతున్నారు. మధిర నుంచి ఈ పాఠశాలలో విధులు నిర్వహించేందుకు వస్తారని తెలిపారు.


చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి, భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన గురువు.. ఇలా ఫుల్లుగా తాగి సోయి లేకుండా పడిపోవడంతో ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘తాగొచ్చి పిల్లలకు ఏం పాఠాలు చెప్తావ్? మా లాంటోళ్లమేమో, ఉద్యోగాలు లేక.. ఆటో నడుపుకుంటున్నాం’ అంటూ ఆ సారును తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.


మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ వైపు పిలుపు ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. తాను, ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ బడుల్లోనే చదివిన వారమని ఆయన తెలిపారు. సర్కార్ బడుల్లో చదివిన వారిలో ఎంతో మంది.. ఐఏఎస్, ఐపీఎస్ అయ్యారని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సర్కార్ బడుల్లో చేరికలను పెంచేందుకు గడిచిన 20 రోజులుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీచర్ వీరయ్య వ్యవహారం చర్చనీయాంశమైంది.


తిమ్మంపేట గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్న ఈ ప్రాథమిక పాఠశాలలో వీరయ్య రెండేళ్లుగా ఎస్జీటీ టీచరుగా పనిచేస్తున్నారు. తరచూ మద్యం తాగి పాఠశాలకు వస్తుంటారని విద్యార్థులు చెబుతున్నారు. ఉపాధ్యాయుడు వీరయ్య మీద చర్యలు ఏమి తీసుకోలేదా అని హెడ్ మాస్టర్ కిరణ్‌ను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘పాఠశాలకు లేటుగా వచ్చాడు కాబట్టి క్యాజువల్ లీవ్ వేశాం’ అని చెప్పారు. వీరయ్య వ్యవహారంపై విద్యా శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఉపాధ్యాయులు ఇలా మద్యం సేవించి పాఠశాలకు వస్తే, తమ పిల్లల భవిష్యత్ ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇది కేవలం తిమ్మంపేట గ్రామ సమస్య మాత్రమే కాదు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు అసలుకే ఆసక్తి చూపడంలేదు. ప్రైవేట్ స్కూళ్లతో పోలిస్తే, ఏం తక్కువ అనడిగితే.. అనేక కారణాలు చెబుతున్నారు:


1. ప్రభుత్వ బడుల్లో వసతులు సరిగా లేవు.


2. పాఠశాల భవనం ఎప్పుడు కూలుతుందో అనే భయం.


3. పిల్లలపై సరైన నిఘా, పర్యవేక్షణ ఉండటంలేదు.


4. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన సరిగాలేదు


5. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరు


6. ఉపాధ్యాయులు ఉన్నా, ఎప్పుడో వస్తారు.. ఎప్పుడో వెళ్తారు.


సర్కార్ బడుల్లో ఈ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇన్ని సమస్యలున్నా, విధి లేక ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే.. ఇలా ఫూటుగా తాగి బడికొచ్చే ఉపాధ్యాయులుంటే ఎలా? ఆడపిల్లల తల్లిదండ్రులను ఈ ప్రశ్న మరింత వేధిస్తోంది. ఇలాంటి వ్యక్తులు ఉపాధ్యాయ వృత్తికే కళంకం కదూ..! సస్పెండ్ చేయడంతోనే సరిపెడితే సరిపోతుందా..? మరోసారి ఇలాంటి తప్పు చేయాలంటేనే వణుకు పుట్టేలా చర్యలు ఉండొద్దా?










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com