ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హనుమాన్ ఆలయానికి భూమిని విరాళమిచ్చిన ముస్లిం.. ఎంత గొప్ప మనసో

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 25, 2024, 07:34 PM

తెలంగాణ గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక. లౌకికవాదం, మతసామరస్య పరిరక్షణలో దేశానికే మన రాష్ట్రం ఆదర్శం. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో ముస్లింలు, హిందువులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు. ఎవరికి కష్టం వచ్చినా.. ఒకరికొకరు అండగా ఉంటారు. హిందువుల పండుగల్లో ముస్లింలు.. ముస్లిం ప్రార్ధనల్లో హిందువులు పాల్గొంటారు. గతంలో హిందువుల దేవాలయాలకు ముస్లింలు.. ముస్లింల మసీదులకు హిదువులు భూములను దానం ఇచ్చారు.


తాజాగా.. ఓ ముస్లిం వ్యక్తి పెద్ద మనసు చాటుకున్నాడు. మత సామరస్యానికి మన రాష్ట్రం ప్రతీక అని మరోసారి నిరూపించాడు. లక్షలు విలువచేసే భూమిని హనుమాన్ దేవాలయానికి విరాళంగా అందించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివారు మెయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామంలో కొత్తగా హనుమాన్ దేవాలయం నిర్మించారు. బుధవారం వీరాంజనేయ స్వామి విగ్రహాన్ని, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ హాజరయ్యారు.


ఈ సందర్భంగా గ్రామానికి చెందిన సలావుద్దీన్ అనే ముస్లిం వ్యక్తి 5 గుంటల భూమిని ఆలయానికి విరాళంగా ఇచ్చారు. అందుకు సంబంధించిన పత్రాలు రంగరాజన్‌కు అందజేశారు. ఇక్కడ గజం ధర వేలల్లో పలుకుతుంది. అలాంటింది లక్షలు విలువచేసే భూమిని విరాళంగా ఇవ్వటంపై స్థానికులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. భూమిని దానమిచ్చి సలావుద్దీన్ మతసామరస్యాన్ని చాటుకున్నారని కొనియాడుతున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com