తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు రావు.. భావోద్యేగ ట్వీట్ చేశారు. తెలంగాణ దీక్షా దివాస్ సందర్భంగా.. తన తాతయ్యతో తనకున్న అనుబంధాన్ని.. జీవితంలో మరిచిపోలేని బాధపెట్టిన సమయాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. తెలంగాణ కోసం తన తాతయ్య ఆమరణ నిరాహార దీక్షకు దిగినప్పుడు.. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి పోతుందని.. తన కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పడం.. తన జీవితంలో మరిచిపోలేని బాధపెట్టిన సమయమని హిమాన్షు చెప్పుకొచ్చారు. తాను అప్పుడు 4 ఏండ్ల చిన్న వాన్నే కానీ.. తనను బాధకు గురిచేసిన నాటి సందర్భం, ఒక పీడకలగా తన మనసును చాలా కాలం వెంటాడిందని పేర్కొన్నారు. తనకున్న ఒకే ఒక ప్రాణ స్నేహితున్ని పోగొట్టుకుంటానేమోనని భయమైందని పంచుకున్నారు. ఈ మేరకు హిమాన్షు ట్వీట్ చేశాడు.
"సత్యమే గెలుస్తుందని.. న్యాయమే నిలుస్తుందని.. దేవుడు ఎల్లప్పుడు ధర్మాన్ని రక్షిస్తాడని తాతయ్య ఒక ముఖ్యమైన పాఠం నాకు నేర్పుతుండేవాడు. మా విశ్వాసాన్ని ఆ దేవుడు తప్పకుండా మరోసారి నిజం చేస్తాడు." అంటూ హిమాన్షు ట్వీట్ చేశాడు. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ హిమాన్షు ట్విట్ ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ప్రచార పర్వం ముగియగా.. నవంబర్ 30న పోలింగ్ మీదే అందరి దృష్టి నెలకొంది. ఈ క్రమంలో.. ఓటర్లు ఏ పార్టీకి మొగ్గు చూపుతారన్నది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే.. తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్న మూడో ఎన్నికలు కాగా.. ఇప్పటికీ తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ను వర్కవుట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ కూడా ప్రచార సభల్లో తెలంగాణ ఉద్యమం సమయంలో.. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించినట్టు పదే పదే చెప్పుకొచ్చారు. అయితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఓటర్లకు పరిస్థితులను కేసీఆర్ వివరించిన విషయం తెలిసిందే.