ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ట్విట్టర్‌ లేకుంటే బతకలేను అనుకునేవాళ్లకు వాస్తవాలు అర్థంకావు'

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 18, 2023, 07:40 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ విభజన గురించి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. అదే సమయంలో మంత్రి కేటీఆర్ ఇచ్చిన కౌంటర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ కుటుంబానికి దేన్నీ అర్థం చేసుకునే సోయి లేదంటూ ఎద్దేవా చేశారు. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తికి.. సమైక్యతకు, విమోచనానికి తేడా తెలియదా అంటూ ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో.. మాట్లాడుతూ.. బీజేపీ మూడు రాష్ట్రాలను ఎలాంటి సమస్య లేకుండా విభజించిందని తెలిపారు. కానీ.. కాంగ్రెస్ అసమర్థత కారణంగా.. లోక్‌సభ తలుపులు మూసి, పెప్పర్ స్ప్రేలు వాడే పరిస్థితుల మధ్య తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందన్నారు. అప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ అవివేకంతో ఇరు రాష్ట్రాలకు సరైన న్యాయం చేయలేదన్న ఉద్దేశంతోనే మోదీ పార్లమెంట్‌లో ఆవేదన వ్యక్తం చేశారని వివరించారు.


ఈ క్రమంలోనే మోదీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కేటీఆర్‌ను కిషన్ రెడ్డి తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. ట్విట్టర్‌లో మాత్రమే మాట్లాడతాను.. ట్విట్టర్ లేకుంటే బతకలేను.. అనే వాళ్లకు వాస్తవాలు అర్థం కావంటూ వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన అమెరికా వెళ్లి నేర్చుకున్నది కేవలం.. ట్విట్టర్ వాడటం ఒక్కటే కావొచ్చంటూ సెటైరికల్ కామెంట్లు చేశారు కిషన్ రెడ్డి. మరోవైపు.. టీఆర్ఎస్‌తో పొత్తుపెట్టుకుని అధికారాన్ని పంచుకుని.. తెలంగాణ ఇవ్వకుండా ఆలస్యం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ దుయ్యబట్టారు కిషన్ రెడ్డి. 42 రోజుల పాటు తెలంగాణలో సకలజనుల సమ్మె చేస్తే కానీ కాంగ్రెస్ పార్టీ స్పందించలేదన్నారు. హామీ ఇచ్చాం.. తెలంగాణ ఇచ్చామంటూ ఇప్పుడు కాంగ్రెస్ చెప్పుకుంటోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలతో కాంగ్రెస్ పార్టీ రాలేదన్నారు కిషన్ రెడ్డి.


1952 నుంచి కూడా కాంగ్రెస్ అనేక రకాల హామీలు ఇచ్చారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. 1971లో గరీబీ హటావో, 16 పాయింట్ పార్ములా.. ఏ ఒక్కదాన్నీ అమలు చేయలేదన్నారు. నిన్న హైదరాబాద్‌లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు మోసపూరితమైనవన్నారు. కాంగ్రెస్ హయాంలో కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయన్నారు. వాళ్లకు దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసన్నారు. ఈ హామీలల్లో పూర్తిగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం తప్ప.. ఇవేవీ అమలు చేయలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీదన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com