ఎన్డీయే, ఇండియా కూటముల్లోని రాజకీయ పార్టీలు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేవని, కేసీఆర్ నేతృత్వంలో జాతీయ స్థాయిలో థర్డ్ ఫ్రంట్ గెలిచే అవకాశముందని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాలు, మహారాష్ట్రకు చెందిన అనేక పార్టీలు ఈ ఫ్రంట్లల్లో సభ్యత్వం తీసుకోలేదని, అందుకే దేశ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్కు ప్రాధాన్యం ఏర్పడిందని స్పష్టం చేశారు. దీనికి కేసీఆర్ నాయకత్వం వహించాలని ప్రజలు ఆశిస్తున్నారన్నారు. అలానే సీడబ్ల్యూసీ సమావేశాలపై అయన స్పందిస్తూ..... దళితులు, వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు పెంచాలని సీడబ్ల్యూసీ సిఫారసు చేసిందని.. అయితే ముస్లిం మైనారిటీ వర్గాల పరిస్థితేంటని అసద్ ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు మైనార్టీలను కాపాడుతూ, వారి కోసం పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని వెల్లడించారు.