పగలంతా నిర్మాణ రంగంలో కూలీలుగా వ్యవహరిస్తూ రాత్రయితే వీలున్నచోట ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను హైద రాబాద్ ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పృథ్వీధర్రావు కథనం ప్రకారం… ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలంలోని తుమ్మలనగర్ చెందిన పేరాల నర్సింహ(23), మాదకం రమేష్(22), రెడ్డిపాలెం గ్రామానికి చెందిన గుండి జగదీష్ (21), పినపాక గ్రామానికి చెందిన పెడియాల సారయ్య(19) ముఠాగా ఏర్పడి ఆలయాలనే లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నట్టు చెప్పారు. గతంలో ఖమ్మం, భద్రాచలం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోని ఆలయాల్లో చోరీలకు పాల్పడి జైలుకు కూడా వెళ్లి వచ్చినా వారి తీరు మారలేదని, జైలు నుంచి విడుదలయ్యాక భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ . ఎన్టీఆర్ నగర్, మున్సూరాబాద్, సాయినగర్ పరిధిలోని ఆరు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడినట్టు తెలిపారు. ఇటీవల చోరీ చేసిన బండిపై తిరుగుతున్న వీరిని అనుమానించిన మఫ్టీలో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు వ్యవహారం బయటపడిందని, ఈ ముఠా అందరినీ అరెస్టు చేసి కస్టడీకి తరలించామని ఏసిపి చెప్పారు.