బాలీవుడ్ మూవీ "మద్రాస్ కేఫ్" తో తెరంగేట్రం చేసింది ఢిల్లీ బ్యూటీ రాశిఖన్నా. ఈ సినిమా తరవాత ఆమెకు హిందీ అవకాశాలు అంతగా రాలేదు కానీ సౌత్ లో మాత్రం వరస అవకాశాలు రాశిని సౌత్ హీరోయిన్ గా మార్చేశాయి. "మనం" తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశిఖన్నా, నాగసౌర్య నటించిన "ఊహలు గుసగుసలాడే" సినిమాతో హీరోయిన్గా నిలదొక్కుకుంది. వరసపెట్టి తెలుగు, తమిళ, మలయాళ సినిమాలను చేసింది. టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒక్క తారక్ సరసన నటించిన రాశి ఖన్నా మిగిలిన స్టార్ హీరోల సరసన మాత్రం జట్టు కట్టలేకపోయింది. కానీ, మిడిల్ రేంజ్ హీరోలందరిని చుట్టబెట్టేసింది.
రాశిఖన్నా సినీ కెరీర్ కు నేటితో ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రాశిఖన్నా సోషల్ మీడియా వేదికగా థాంక్యూ నోట్ ను పంచుకుంది. ఈ ఎనిమిదేళ్ల ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలను తెలుపుతూ ఒక ఎమోషనల్ నోట్ ను పంచుకుంది. ఈ మేరకు సాయంత్రం ఆరు గంటలకు తననుండి ఒక సర్ప్రైజ్ రానున్నట్టు తెలిపింది. కొంతమంది సెలెబ్రిటీలు, అభిమానులు ఈ సందర్భంగా రాశికి హృదయపూర్వక శుభాకాంక్షలను తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.