టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్ గతేడాదిలోనే పూర్తయింది. 1990లలో తెలంగాణ లో జరిగిన నక్సలైట్ల ఉద్యమం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది ఏప్రిల్లో విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది. షూటింగ్ మొదలైనప్పటి నుండి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ముఖ్యంగా రానా, సాయి పల్లవి లాంటి ఫ్రెష్ కాంబో పట్ల ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు.
ఈ సినిమాలో హీరో రచనలను అమితంగా ఇష్టపడే వెన్నెల పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నట్టు, ఆమె పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన గ్లిమ్స్ ను బట్టి తెలుస్తుంది. హీరో ముఖం చూడకుండానే ప్రేమలో పడిన వెన్నెల, అతన్ని వెతుక్కుంటూ అడవికి వెళ్తుందని, ఆ క్రమంలో అక్కడి భారతక్క (ప్రియమణి) వెన్నెల ను కాల్చి చంపుతుందని అంటున్నారు. అంటే ఈ సినిమాలో సాయి పల్లవి పాత్రకు ట్రాజెడీ ఎండింగ్ ఇచ్చారన్నమాట. ఈ విషయం తెలుసుకున్న సాయి పల్లవి అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తమ అభిమాన నటిని అలాంటి సన్నివేశంలో చూడలేమని, అది తమకు చాలా బాధ కలిగిస్తుందని వాపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే జూలై 1వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.