లక్నో : లక్నోలోని ఒక స్కూల్లో ఒకటవ తరగతి చదువుతున్న ఒక బాలుడిని అదే స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్న బాలిక కత్తితో పొడిచింది. స్కూల్లోని టాయిలెట్కు బాలుడు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ బాలుడు కింగ్ జార్జి మెడికల్ యూనివర్శిటీ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. స్కూల్ యాజమాన్యం ఆ బాలుడి తల్లిదండ్రులకు యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు బైటికి రాకుండా జాగ్రత్తపడ్డారు. కాగా ఆసుప్రతి అధికారులు మీడియాకు ఈ సంఘటన వివరాలు తెలియజేయడంతో ఇది వెలుగు చూసింది. విలేఖరులు స్కూల్కు వెళ్లి వివరాలు అడిగిన తరువాత స్కూల్ అధికారులు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గురించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయనందుకు స్కూల్ యాజమాన్యానికి జిల్లా పాఠశాలల ఇన్స్పెక్టర్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఫొటోల ఆధారంగా తనను పొడిచిన బాలికను బాధితుడు గుర్తించడంతో ఆమెను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.