న్యూఢిల్లీ: అణ్వాయుధ, రసాయనిక ఆయుధాలు ఉగ్రవాదులు చేతుల్లోకి వెళ్లడం వల్ల మానవాళికే ముప్పు ఏర్పడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ఇవాళ రాష్ట్రపతి భవన్లో జరుగుతున్న రైసినా సదస్సులో ఆయన మాట్లాడారు. సాంకేతికంగా అత్యాధునికంగా ఉన్న ఆయుధాలను ఉగ్రవాదులు వాడుతున్నారని, వాళ్లు సులువుగా అంతర్జాతీయ సరిహద్దులు దాటేస్తున్నారని, అలాంటి ఉగ్రవాదులను, స్పాన్సర్లను అడ్డుకోవాల్సిన అవసరం ఉందని రావత్ అన్నారు. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న దేశాలను గుర్తించాలన్నారు. ఇంటర్నెట్తో పాటు సోషల్ మీడియాపైన కూడా కొంత వరకు ఆంక్షలు విధించాలన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఈ ఆంక్షలను అంగీకరించలేరు, కానీ భద్రత, సురక్షిత సమాజం కోసం ఇదే అవసరమని జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. కశ్మీర్ అంశంపైన కూడా ఆర్మీ చీఫ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం వల్ల కశ్మీర్ ప్రజలు అలసిపోయినట్లు ఆయన తెలిపారు. ఉగ్రవాదాన్ని ఆశ్రయించడం వల్ల వాళ్లకు ఏమీ జరగేలదు, ఇప్పుడు వారంతా సాధారణ జనజీవన శ్రవంతిలో కలవాలనుకుంటున్నారని ఆర్మీ చీఫ్ చెప్పారు. ఆర్మీకి అత్యాధునిక నిఘా వ్యవస్థ అవసరమని ఆయన తెలిపారు. సైనిక బలగాల సత్తాను ఆధునీకరించాలన్నారు. రాత్రి పూట కూడ దాడులు చేసేందుకు కావాల్సిన సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నారు. అజాల్ట్ రైఫిళ్లు, బాలిస్టిక్ హెల్మెట్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలన్నారు.