-వాటికి అమెరికాలో తావులేదు
-తెలుగువారిపై కాల్పులపై సత్య నాదెళ్ల
-బాధితులకు సంతాపం తెలిపిన మైక్రోసాఫ్ట్ చీఫ్
-కుటుంబాలను ఆదుకుంటామని వెల్లడి
కాలిఫోర్నియా: అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రం ఒథాలే ప్రాంతంలో ఉన్న ఆస్టిన్స్ బార్లో జరిగిన కాల్పుల ఘటనలో హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పందిస్తూ... మన సమాజంలో ఇలాంటి మతిలేని హింసకు, మతవిద్వేషానికి తావులేదని వ్యాఖ్యానించారు. ఈ కాల్పుల ఘటనలో బాధితులైన కుటుంబాలకు తన సానుభూతి తెలుపుతున్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలని ఆదుకుంటానని తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో శ్రీనివాస్ స్నేహితుడు అలోక్రెడ్డికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
విదేశీయులపై వ్యతిరేకత తప్పు: గుటెరెస్
విదేశీయుల పట్ల విపరీతమైన వ్యతిరేకత, ముస్లింల పట్ల భయం, వ్యతిరేకతతో ఉండడాన్ని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తీవ్రంగా తప్పుపట్టారని ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజార్రిక్ తెలిపారు. అమెరికాలోని కన్సాస్లో తెలుగు ఇంజనీర్ను కాల్చి చంపిన నేపథ్యంలో స్టీఫెన్ స్పందించారు. అమెరికా కాల్పుల ఘటనను తీవ్రంగా ఖండించారు. గత కొన్ని నెలలుగా ఆంటోనియో ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న జాత్యహంకార నేరాలను తీవ్రంగా ఖండిస్తున్నారని, విదేశయుల పట్ల, ముస్లింల పట్ల విపరీతమైన వ్యతిరేకత చూపడం తప్పని చెప్తూనే ఉన్నారని స్టీఫెన్ పేర్కొన్నారు.
అమెరికాలో దక్షిణాసియా ప్రజలపై విద్వేష నేరాలు విపరీతంగా పెరిగిపోవడం పట్ల, కన్సాస్ నగరంలో 32ఏళ్ల శ్రీనివాస్ కూచిభొట్లను అమెరికా నేవీ మాజీ అధికారి కాల్చి చంపడంపై ఐరాస చీఫ్ స్పందన గురించి విలేకరులు ప్రశ్నించగా స్టీఫెన్ పై విధంగా సమాధానమిచ్చారు. కన్సాస్ కాల్పుల్లో మరో తెలుగు యువకుడు అలోక్, అమెరికన్ గ్రిల్లాట్ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన భారతీయులను, మానవ హక్కుల సంఘాలను తీవ్రంగా కలవరపెడుతోంది.