ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

national |  Suryaa Desk  | Published : Mon, Jul 04, 2022, 12:05 AM

ఆ విషాదం ఇంకా ఎన్ని కుటుంభాల్లోకి వస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. శిథిలాల కింద నుంచి ఇప్పటివరకు 27 మంది మృతదేహాలను వెలికితీశారు. వీరిలో 20 మంది జవాన్లే కావడం గమనార్హం. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇంకా 35 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. బాధితుల కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


మణిపూర్‌లోని నోనె జిల్లాలో రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణ పనులు కొనసాగుతున్న చోట కొండచరియలు విరిగిపడ్డాయి. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో.. నిర్మాణ పనుల్లో నిమగ్నమైన సిబ్బందికి రక్షణ కల్పించేందుకు భద్రతా బలగాలను మోహరించారు. ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతున్న ప్రాంతానికి చేరువలో వీరు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి షెల్టర్లపై జూన్ 29, 30 మధ్య రాత్రి ఒక్కసారిగా పెద్ద పెద్ద రాళ్లు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. జవాన్లు, ఇతర సిబ్బంది శిథిలాలతో పాటు కిందికిజారి అక్కడి ప్రవాహంలో పడిపోయారు.


ఇదిలావుంటే జిరిబమ్‌ - ఇంఫాల్‌ మార్గంలో తుపుల్‌ రైల్వే యార్డు వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 27 మంది మృతి చెందగా.. వీరిలో 20 మంది ప్రాదేశిక సైన్యానికి చెందిన జవాన్లు, ఏడుగురు పౌరులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం నుంచి ఇప్పటివరకు 13 మంది జవాన్లు, ఐదుగురు పౌరులను సహాయక సిబ్బంది రక్షించారు. శిథిలాల కింద ఇంకా 35 మంది ఉన్నట్లు సమాచారం. ఎడతెరిపిలేని వర్షాలు, కొండచరియలు విరిగిపడుతుండటం సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. ప్రమాద స్థలానికి సమీపంలోనే మరో చోట కొండచరియలు విరిగిపడటం రెస్క్యూ సిబ్బందిని, అక్కడి ప్రజలను మరోసారి ఉలికిపాటుకు గురిచేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com