నగరంలోని వాయు కాలుష్యం శ్రీలంక పేసర్ సురంగా లక్మల్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భారత్ తో మూడో టెస్టులో భాగంగా రెండో రోజు ఆటలో అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్న లంక క్రికెటర్ లక్మల్.. నాల్గో రోజు ఆటలో కూడా వాంతులు చేసుకున్నాడు. మంగళవారం నాల్గో రోజు ఆటలో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కొద్దిసేపటికే లక్మల్ ఇబ్బంది పడటం కనిపించింది. ఈ క్రమంలోనే వాంతులు చేసుకున్న లక్మల్కు వైద్య సాయం అవసరమైంది. ఈ రోజు ఆటలో లక్మల్ మూడు ఓవర్లు వేసిన తరువాత అస్వస్థతకు లోనయ్యాడు. దాంతో జట్టు ఫిజియో సాయంతో లక్మల్ ఫీల్డ్ను విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఈ రోజు ఆటలో కూడా చండిమల్, ఏంజెలో మాథ్యూస్లు మాస్క్లు ధరించే ఫీల్డ్లోకి దిగడం గమనార్హం.
ఆదివారం రెండో రోజు ఆటలో పొగ కాలుష్యం కారణంగా పలువురు లంకేయులు మాస్క్లు ధరించి ఫీల్డింగ్ చేసిన సంగతి తెలిసిందే. దానిలో భాగంగా లక్మల్, లహిరు గామేజ్లు ఇబ్బందికి గురై ఫీల్డ్ నుంచి వెళ్లిపోయారు. ఆపై కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉందని, మ్యాచ్ను నిలిపివేయాలని పదేపదే అంపైర్లకు విజ్ఞప్తి చేశారు. అయితే మ్యాచ్ కొనసాగింపుపై రిఫీరీదే తుది నిర్ణయం కావడంతో లంక క్రికెటర్లు బలవంతంగా ఆటను కొనసాగిస్తున్నట్లు కనబడుతోంది.