తెలుగు రాష్ట్రాలలో చలి తీవ్రత పెరిగింది. రోజు రోజుకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఇరు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలితీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. చలితీవ్రత పెరగడంతో ఉదయం సమయంలో ఏజెన్సీ ప్రాంతాలైన తెలంగాణలోని ఆదిలాబాద్, ఏపీలోని విశాఖ జిల్లాలో దట్టంగా పొగమంచు కమ్ముకుంటోంది. దీంతో రహదారులపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ ఏజెన్సీలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదవగా, ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాలైన లంబసింగి 5, మినమలూరు 6, చింతపల్లిలో 7, పాడేరులో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీలలో చలి పెరగడంతో ప్రజలు చలి మంటలు వేసుకుంటున్నారు.