కర్నూలు: వైఎస్ జగన్ పాదయాత్రలో మద్యం ఏరులై పారుతోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఇలాంటి నాయకుడు మద్యనిషేధం విధిస్తారా అని ప్రశ్నించారు. అయితే జగన్ మాటలు ప్రజలు నమ్మడం లేదన్నారు. జగన్ జీవితమంతా అబద్దాలేనని మండి పడ్డారు. సీఎం చంద్రబాబును తిట్టేందుకే జగన్ పాదయాత్ర చేపట్టారని ధ్వజమెత్తారు. సోమవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జగన్ పాదయాత్రలో ప్రజలెవ్వరూ పాల్గొనడం లేదని, కడప నుంచి పిలిపించుకున్న గూండాలే పాల్గొంటున్నారని ఆరోపించారు. వారికి రోజూ రూ.275 నగదు, క్వార్టర్ మందు, బిర్యాని ఇస్తున్నారన్నారు. పగలు పాదయాత్ర, రాత్రి మందు, చికెన్, మటన్తో పండుగ చేసుకుంటున్నారన్నారు. పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అయిపోయినట్లు జగన్ కలలు కంటున్నారని, ఆయన కలలు ఎన్నటికీ నెరవేరవని అన్నారు. రాయలసీమలో పాదయాత్ర చేస్తున్న జగన్ ఇక్కడి సమస్యల గురించిగానీ, ఈ ప్రాంత అభివృద్ధి గురించి గానీ ఎక్కడైనా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. సీఎం రాష్ర్టాభివృద్ధికి చేస్తున్న కృషిని చూసి ప్రపంచ దేశాల నేతలు ప్రశంసిస్తున్నారని, అది చూసి జగన్ బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. అధికార పక్షం, ప్రతిపక్షం ఏంటో కూడా తెలియని స్థితిలో జగన్కు ఉన్నారన్నారు.