ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో లడ్డూల రగడ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 11, 2017, 02:24 PM

తిరుమలలో లడ్డూల విషయమై భక్తులకు, కౌంటర్‌లో ఓ వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు విజిలెన్స్‌ అధికారుల జోక్యంతో వివాదం సద్దు మణిగింది. వివరాలిలా.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన నాగభూషణంతో పాటు మొత్తం 26 మంది భక్తులు రూ.300 టికెట్లు బుక్‌ చేసుకుని వేంకటేశ్వరుని దర్శనార్థం శుక్రవారం తిరుమలకు వచ్చారు. వీరు అదనపు లడ్డూలు కూడా బుక్‌ చేసుకున్నారు. దీంతో వీరికి మొత్తం 102 లడ్డూలు రావాల్సి ఉంది. దర్శనానంతరం లడ్డూ కౌంటర్‌ వద్దకు చేరుకుని టికెట్లు ఇచ్చి లడ్డూలు ఇవ్వమని కోరగా కౌంటర్‌లో పనిచేసే వ్యక్తి కేవలం వీటికి 56 మాత్రమే వస్తాయని చెప్పాడు. అయితే దీనికి భక్తులు తాము బుక్‌ చేసుకున్న మేరకు 102 లడ్లు రావాలని చెప్పడంతో వీరి మధ్య వాగ్వాదం జరిగింది. కౌంటర్‌ లో పనిచేసే వ్యక్తి దురుసుగా మాట్లాడి వీరికి లడ్డూలు ఇవ్వకుండా పంపించేశాడు.


 వెంటనే భక్తులు టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేశారు. ఫోన్‌ పనిచేయకపోవడంతో నేరుగా విజిలెన్స్‌ అధికారులను సంప్రదించారు. విజిలెన్స్‌ అధికారులు టికెట్లను పరిశీలించగా భక్తులు చెప్పింది వాస్తవమే అని తేలింది. ఆ మేరకు భక్తులకు 102 లడ్డూలు ఇచ్చి పంపారు. అయితే భక్తులతో కౌంటర్‌లో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచారు. అయితే, ఈ వ్యవహారంపై మీడియా ప్రతినిధులు అక్కడకు వెళ్లగా అధికారులు ఏమీ జరగలేదని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com