వైసీపీ అధినేత జగన్ ఇడుపులపాయ చేరుకున్నారు. తండ్రి దివంగత రాజశేఖర్ రెడ్డి సమాధి వద్దకు వెళ్లి ఘన నివాళి అర్పించారు. తన పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని కోరుతూ, ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట తల్లి విజయమ్మ, భార్య భారతి, చెల్లెలు షర్మిల ఉన్నారు. అంతకుముందే వైసీపీ కీలక నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, రోజా, లక్ష్మీపార్వతి తదితరులు వైయస్ సమాధి వద్దకు చేరుకున్నారు. వైయస్ సమాధి వద్ద నుంచి జగన్ సభాప్రాంగణానికి వెళ్లారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మకమైన 'ప్రజాసంకల్ప యాత్ర'కు సిద్ధమయ్యారు. పులివెందులలో తన నివాసంలో తల్లి విజయమ్మ నుంచి ఆశీస్సులు తీసుకొని.. సోదరి షర్మిల, ఇతర కుటుంబసభ్యులకు వెళ్లొస్తానని చెప్పి.. అశేషమైన అభిమానులు, కార్యకర్తల మద్దతు నడుమ వైఎస్ జగన్ ఇడుపులపాయకు బయలుదేరారు. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద మహానేతకు కుటుంబసభ్యులతో కలసి వైఎస్ జగన్ నివాళులర్పించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జనంతో మమేకమై.. తొలి అడుగులు వేస్తూ 'ప్రజాసంకల్ప యాత్ర'ను ప్రారంభించారు.