క్రోమోజోముల అసమతుల్యత వలన, తల్లిదండ్రుల అనువంశిక సమస్యల వలన పిల్లల మెదడు సరిగా ఎదగక మానసిక వికలాంగులుగా మారిపోతారని, చిన్న తల, ఏకాగ్రత లేకపోవడం, స్వతంత్రంగా ఆలోచించ లేకపోవడం, తమ పనులు కూడా తాము చేసుకోలేక పోవడం, వంటివి డౌన్ సిండ్రోమ్ లక్షణాలని, ఇటువంటి పిల్లలను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా, కంటికి రెప్పలా కాపాడుకొని, ప్రేమ, అనురాగం, ఆప్యాయతని పంచాలని, మానసిక వికలాంగులకు చేసే సేవ దైవసేవతో సమానమని, పులివెందుల భవిత స్కూల్ రిసోర్స్ ఉపాధ్యాయులు ప్రకాశమ్మ, స్వాతి పేర్కొన్నారు.
ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పులివెందుల పట్టణంలో స్థానిక చిన్నన్న రూముల రోడ్డులోని భవిత స్కూల్ లో, సహిత విద్య విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో వారు మానసిక వికలాంగుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి, సూచనలు, సలహాలు, జాగ్రత్తలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి. ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్లు వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణమూర్తి, భవితస్కూల్ చిన్నారులకు, ఐదు వేల రూపాయల విలువ చేసే ఆటవస్తువులను, ఈ సందర్భంగా వితరణగా అందించారు. అనంతరం దివ్యాంగులకు స్వీట్లు పంపిణీ చేశారు. దివ్యాంగ చిన్నారులకు చేయూతనిచ్చిన పెన్షనర్ల సంఘం నాయకులకు వికలాంగుల నెట్వర్క్ రాష్ట్ర అధ్యక్షులు ఇరికిరెడ్డి రఘునాథ్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెండోవార్డు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చెన్నమ్మ, ఉపాధ్యాయులుప్రకాశమ్మ, స్వాతి, పిజియోథెరపిస్టు లక్ష్మీదేవి, ఆయా అరుణ, పెన్షనర్ల సంఘం నాయకులు డివి కొండారెడ్డి, మునిరెడ్డి, రంగారెడ్డి, కృష్ణమూర్తి, గోపాల్ రెడ్డి, బండి శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |