అంతా అనుకున్నట్లుగానే టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ను రాజ్యసభ బరిలోకి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దించేసింది. పంజాబ్ నుంచి రాజ్యసభ సీటు కోసం తమ పార్టీ అభ్యర్థిగా భజ్జీని ఆప్ ప్రకటించింది. ఈ మేరకు భజ్జీ.. సోమవారం ఛండీగఢ్లో నామినేషన్ దాఖలు చేశారు. ఆప్కు ఉన్న బలం మేరకు భజ్జీ గెలుపు నల్లేరు మీద నడకేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆప్ తరఫున రాజ్యసభ బరిలోకి దిగిన భజ్జీ.. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. క్రీడల్లో భారత్ తరఫున మరింత మేర ప్రాధాన్యం పెరగాల్సి ఉందని, ఆ దిశగా తాను కృషి చేస్తానని భజ్జీ ప్రకటించారు. భారత యువతకున్న సత్తాను చూస్తుంటే.. ఒలింపిక్స్లో భారత్కు 200లకు తగ్గకుండా పతకాలు రావాల్సి ఉందని కూడా భజ్జీ అభిప్రాయపడ్డారు.