సూర్యుడి ఆగ్రహానికి అడ్డుకట్టే వేసేలా ఏపీకి వర్ష సూచన కనిపిస్తోంది. ఏపీకి వాతావరణశాఖ ఈ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అండమాన్ తీరం దగ్గర ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరింత బలపడి బంగ్లాదేశ్, మయన్మార్ వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారంలోగా పూర్తి అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రభావంతో కోస్తాంధ్రతో పాటూ ఒడిశా తీరంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. పశ్చిమ హిమాలయాల ప్రాంతంలో ఈ నెల 20 వరకు వర్షాలు, మంచు కురుస్తుందంటున్నారు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజుల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కర్ణాటకలో ఈ నెల 18 నుంచి 20 వరకు వర్షాలకు అవకాశం ఉంది. అలాగే ఏపీ, తెలంగాణల్లో ఈ నెల 20, 21న తేలికపాటి జల్లులు కురుస్తాయని చెబుతున్నారు. రెండు వారాల క్రితం కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో వాన జల్లులు కురిశాయి. వర్షాల సంగతి అలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. పగటి పూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరగుతుండటంతో పాటు ఉక్కపోతకు వేడిగాలి కూడా తోడవ్వడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. విజయవాడ నుంచి ఉత్తరాంధ్ర వరకు అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రోజు రాయలసీమ జిల్లాల్లో ఎండలు ఎక్కువగా ఉన్నాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో 42 డిగ్రీల దాక ఉష్ణోగ్రతలు నమోదయ్యింది. శనివారం వేడి ఉంటుంది కానీ గత మూడు రోజులతో పోలిస్తే తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. విజయవాడ పరిసర ప్రాంతాలతో పాటు గుంటూరు, కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కర్నూలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నేడు 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవ్వనుందని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు రాయలసీమలోని చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కూడా ఎండలు ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు.