ఐరోపా, ఆసియా తీరాలను అనుసంధానించే తీగల వంతెనను టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, దక్షిణ కొరియా ప్రధానమంత్రి కిమ్ బూ క్యుమ్ కలిసి ప్రారంభించారు. 2 వేల 23 మీటర్ల పొడవైన ఈ వంతెనను “1915 కనక్కలె బ్రిడ్జ్ "గా పిలుస్తున్నారు. ఇది ప్రపంచంలోనే పొడవైన తీగల వంతెనగా.. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ అభివర్ణించారు. ఐరోపావైపు కనక్కలే రాష్ట్రంలోని గెలిబోలు పట్టణాన్ని, ఆసియావైపు లప్సేకి పట్టణాన్ని.... ఈ వారధి అనుసంధానిస్తుంది. ఈ రెండు పట్టణాలు టర్కీలోనే ఉన్నాయి.ఈ రెండు ప్రాంతాల మధ్య నౌకలో గంటన్నర పట్టే ప్రయాణ సమయం...ఈ వంతెనపై ఆరు నిమిషాలే పడుతుందని ఎర్డోగాన్ చెప్పారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో.. బ్రిటిష్, ఫ్రెంచ్ సంయుక్త బలగాలపై టర్కీ నేవీ విజయం సాధించి 107ఏళ్లైన సందర్భంలోనే ఈ వంతెన ప్రారంభించారు. టర్కీ, దక్షిణ కొరియా కంపెనీల భాగస్వామ్యంతో నిర్మించిన కనక్కలే వంతెన....... ఇరుదేశాల మైత్రిని మరింత బలోపేతం చేస్తుందని దక్షిణ కొరియా ప్రధాని కిమ్ క్యుమ్ చెప్పారు. దాదాపు 2.7 బిలియన్ డాలర్లతో ఈ వంతెనను నిర్మించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.