పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు పదవీ గండం పొంచి ఉంది. ఆ దేశంలో రాజకీయాలు రోజురోజుకి అనూహ్య మలుపులు తీసుకుంటున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చి 28న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రభుత్వానికి తమ మద్దతును విరమించుకుంటున్నట్లు కూటమిలోని నలుగురు సభ్యులు బహిరంగంగా ప్రకటించారు. ప్రస్తుతం 342 మంది సభ్యులున్న పాకిస్తాన్ పార్లమెంట్ లో 172 మంది ఇమ్రాన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తే... ఆయన తన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం. ఇమ్రాన్ ఖాన్ పార్టీ PTIకి 156 స్థానాలు మాత్రమే ఉన్నాయి. గతంలోనే ప్రభుత్వ ఏర్పాటులో దాదాపుగా 20 సీట్లు తక్కువకాగా అతికష్టం మీద ఇతర పార్టీల మద్దతుతో ఇమ్రాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇమ్రాన్ ఖాన్ పాలనపై భాగస్వామ్య పార్టీలు అసంతృప్తితో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నెల 28న జరిగే అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ ప్రభుత్వానికి స్వస్థి పలుకుతామని పాక్ విపక్షనేత పాకిస్తాన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడు షాబజ్ షరీఫ్ అన్నారు. ఇమ్రాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ -PTI ప్రభుత్వాన్ని తొలగించి జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జోస్యం చెప్పారు.