కరోనా మహమ్మారికి చెక్ పెట్టే క్రమంలో భారత్ రేపు మరో కీలక అడుగు వేస్తోంది. 12 నుంచి 14 ఏళ్ల చిన్నారులకు రేపటి నుంచి భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలుకాబోతోంది. ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకు హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ ఉత్పత్తి చేసిన కోర్బ్ వ్యాక్స్ టీకాను వేయనున్నారు. అధికారిక అంచనాల ప్రకారం దేశ వ్యాప్తంగా 12 నుంచి 14 ఏజ్ గ్రూప్ పిల్లలు 7.11 కోట్ల మంది ఉన్నారు. బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఇప్పటికే 5 కోట్ల డోసుల కోర్బ్ వ్యాక్స్ టీకాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ టీకాలు ఇప్పటికే రాష్ట్రాలకు పంపిణీ చేయబడ్డాయి. మరోవైపు, రేపు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ పిల్లలు సురక్షితంగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని అన్నారు. 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు రేపటి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు.