క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్ సోమవారం విశాఖలోని ఓ హోటల్లో క్రైస్తవ, బీసీ సంఘాలతో సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని క్రైస్తవ సంఘాలు, బీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని బ్రదర్ అనిల్ అన్నారు. వివిధ సంఘాల ప్రతినిధులు తనతో బాధలు చెప్పుకున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు వైసీపీకి వారంతా సాయం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు వారి బాధలు పట్టించుకునేవారే లేరని అన్నారు. సమయం కుదిరినప్పుడు సీఎం జగన్ ను కలిసి సమస్యలను వివరించే ప్రయత్నం చేస్తానన్నారు. క్రైస్తవ సంఘాలకు అన్యాయం జరిగిందని, వారు ప్రత్యామ్నాయ పార్టీ పెడతామంటున్నారని అన్నారు. వారికి మద్దతుగా ఉంటానని చెప్పారు. ఎన్నికల ముందు తనను నమ్మి ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేశారని, ఇప్పుడు వారు బాధలో ఉంటే స్పందించే బాధ్యత తనకు ఉందని అన్నారు