వైసీపీలో రాజకీయ నిర్ణయాలు వేగంగా మారుతున్నాయి. తొలి దశలో పార్టీ అనుబంధ కమిటీల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వెనువెంటనే మంత్రివర్గం విస్తరణకు కూడా ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా, ఉగాది నుంచి కొత్త జిల్లాల పాలన సాగించాలని భావిస్తోన్న ప్రభుత్వం కొత్త జిల్లాలు... కొత్త మంత్రులు అంటూ సరికొత్త పాలనకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే గుంటూరు, భావపురి (బాపట్ల), పల్నాడు జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో జిల్లాకు ఒక మంత్రి చొప్పున ప్రాతినిధ్యం వహించేలా మంత్రి వర్గం పునర్వవ్యవస్థీకరణ చేయనున్నట్లు తెలుస్తోంది.
పార్టీలో ఇప్పటికే అన్నీ వర్గాలకు ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పోరేషన్ల పదవులను ఇచ్చిన ముఖ్యమంత్రి ఇక నుంచి వారిని పాలనలో కూడా భాగస్వామ్యం చేయాలని భావిస్తున్నారు. అదే విధంగా ఎన్నికల టీంను కూడా జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరు ఎప్పటికప్పుడు ఇంటిలిజెన్సు వారి నుంచి సమాచారాన్ని తీసుకుని అందుకు అనుగుణంగా నియోజకవర్గాలలో పార్టీ బలాన్ని, బలహీనతలను సంబంధిత నేతలకు తెలియజేయాల్సి ఉంటుంది.
పల్నాడు జిల్లాకు మంత్రి ఎవరు..?
ఉగాదిలోగా మంత్రి వర్గం పునర్వవ్యవస్థీకరణ ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రి వర్గం సమావేశంలో స్పష్టం చేయటంతో జిల్లాలో ఎవరికి మంత్రి పదవి వరించనుందోన్న చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో మోపిదేవి వెంకటరమణ, మేకతోటి సుచరితకు అవకాశం ఇంటిలిజెన్సు వారి నుంచి దక్కింది. అయితే మోపిదేవి రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆ మంత్రి పదవి ఇప్పటి వరకు ఎవరికీ ఇవ్వలేదు. జిల్లాలో గత ఏదాడిదిగా మేకతోటి సుచరిత ఒక్కరే ఉన్నారు.
అయితే భవిష్యత్తులో ఆమెకు పార్టీ బాధ్యతలు కాని, ప్రాంతీయ మండలి చైర్మన్ గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మూడు కొత్త జిల్లాలకు ముగ్గురు మంత్రులను ఎంపిక చేసే అవకాశాలు కూడా కన్పిస్తున్నాయి. అయితే సామాజిక సమీకరణంను పరిగణలోకి తీసుకుంటే మోపిదేవి వెంకట రమణ బీసీ కావటంతో ఆపదవిలో మరొక బీసీ నేతకు అవకాశం కల్పిస్తారా.. అన్న భావన పార్టీలో వ్యక్తమవుతోంది. అయితే జిల్లాలో ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృషమూరికి అవకాశం రావచ్చు .
ఈ క్రమంలో పల్నాడు నుంచి పరిశీలిస్తే పార్టీలో సీనియర్ నేత, 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితంగా ఉండే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు అవకాశం రావచ్చన్నచర్చ జరుగుతోంది. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.