పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ తృతీయ సంవత్సరం చదువుతున్న మురికుర్తి స్వామికృష్ణసాయి (19) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. భీమవరం రెండో పట్టణ ఎస్సై అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం.. స్వామికృష్ణసాయిది విశాఖపట్నం జిల్లా ఎస్.రాయవరం. భీమవరంలోని కళాశాల వసతి గృహంలో ఉంటున్నాడు.
విశాఖకు చెందిన యువతితో సామాజిక మాధ్యమం ద్వారా పరిచయం ఏర్పడింది. చరవాణి కాలకు సకాలంలో స్పందించకున్నా. మాట్లాడకున్నా మనస్తాపానికి గురయ్యేవాడు. ఈ నెల 9న వీరు మాట్లాడుకున్నారు. కొద్ది సేపటికి గదిలోకి వెళ్లి పంకాకు ఉరేసుకున్నాడు. తోటి విద్యార్థులు వసతిగృహానికి వచ్చేసరికి ఉరికి వేలాడుతుండటంతో యాజమాన్యానికి సమాచారమిచ్చారు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.