వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా ముఖ్యమంత్రి కాలేరని ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలనే దురాశను జగన్ బయటపెట్టుకున్నారని ఇలాంటి వ్యక్తి సీఎం ఎలా అవుతారని ప్రశ్నించారు. రాజు కుమారుడు రాజు కావచ్చేమో కానీ ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి కావాలని ఎక్కడా లేదని ఎద్దేవా చేశారు. జగన్ లాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం తమ అదృష్టమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అసెంబ్లీలో కానీ, బయట కానీ ఇంతవరకు జగన్ ఓ సలహా కూడా ఇవ్వలేదని ఆయన ఏవైనా సలహాలు ఇస్తే తాము తప్పకుండా స్వీకరిస్తామని అన్నారు. రాజమండ్రిలో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో కేఈ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.