తాడేపల్లి పట్టణం నులకపేట సబ్ స్టేషన్ పరిధిలో మంగళవారం విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో 29 బృందాలు, 100 మంది సిబ్బందితో నులకపేట, బ్రహ్మానందపురం, డోలాసనగర్, ప్రకాష్ నగర్, ఉండవల్లి సెంటర్, సీతానగరం, ఉండవల్లి, పోలకంపాడు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు విద్యుత్ శాఖ అమరావతి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రత్తిపాటి విజయ్ కుమార్ తెలిపారు. మొత్తం 3566 విద్యుత్ మీటర్లను పరిశీలించి, 75 కేసులు నమోదు చేశారని, అందులో ఎక్కువ శాతం మంది అనుమతి పొందిన దాని కన్నా ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నారని, వాటిని రెగ్యులరైజ్ చేసేందుకు అపరాధ రుసుం విధించామని చెప్పారు. అలానే ఇంటి నిమిత్తం తీసుకున్న విద్యుత్ కనెక్షన్ ను ఇతర వినియోగాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. మొత్తం రూ. 3, 87, 900 అపరాధ రుసుం విధించినట్లు తెలిపారు. దాడులలో డీఈఈ అక్కల సత్యనారాయణ, వివిధ ప్రాంతాలకు చెందిన ఏఈఈలు , ఏఈలు పాల్గొన్నారు.