ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు శ్రీకాకుళం జిల్లా బంద్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 12, 2017, 09:48 AM

   వంశధార నిర్వాసితుల ఇళ్ల కూల్చివేత, వారిపై ప్రభుత్వ నిర్బంధకాండకు నిరసనగా గురువారం శ్రీకాకుళం బంద్‌ చేపట్టాలని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ సంయుక్తంగా పిలుపునిచ్చారు. బంద్‌ విజయవంతానికి వైసిపి, కాంగ్రెస్‌, లోక్‌సత్తా, జనసేన పార్టీలు సహకరించాలని వారు కోరారు. వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రజలు బంద్‌ను జయప్రదం చేసి నిర్వాసితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ చాలా బాధ్యతారాహిత్యంగా నిర్వాసితుల ఇళ్ల కూల్చివేతకు తేదీలు ప్రకటించారన్నారు.


ఈ తేదీలను వెంటనే ఉపసంహరించు కోకపోతే మరింతగా ప్రతిఘటిస్తామని తెలిపారు. వంశధార నిర్వాసితులపైనా, వంశధార రైతులపైనా జరుగుతున్న దౌర్జన్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగంపై దాడిగా రైతులు భావించాలని కోరారు. వంశధార నిర్వాసితులపై పోలీసుల నిర్బంధాన్ని ఏకోన్ముఖంగా ఖండించాలన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా శ్రీకాకుళం జిల్లాలో పోలీసు రాజ్యం నడుస్తోంద న్నారు. రాష్ట్రాన్ని ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలించారని, ప్రాజెక్టులు కట్టారని, చంద్రబాబు మాదిరిగా పోలీసు పహారాలో ప్రాజెక్టులు కట్టడం ఎన్నడూ చూడలేదని తెలిపారు. వంశధార నిర్వాసితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య, నిరంకుశ వైఖరికి నిరసనగా శ్రీకాకుళం జిల్లా బంద్‌తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com