బెంగళూరు: ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే నడుస్తున్న ఇందిరా క్యాంటీన్లను వచ్చే ఏడాది నుంచి కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అన్నార్తులకు, పేదప్రజలకు నూతన సంవత్సర కానుకగా జనవరి 1వ తేదీన ఈ క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, తాలుకాల్లో ఇందిరా క్యాంటిన్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 246 క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. నిర్మాణ దశలో ఉన్న క్యాంటీన్ భవనాలు డిసెంబర్ 17నాటికి పూర్తి కానున్నాయి. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు అదేవిధంగా లక్ష జనాభా మించి ఉన్న ప్రాంతాల్లో ఇందిరా క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీ.బీ. జయచంద్ర తెలిపారు. భవన నిర్మాణాలకు రూ. 185 కోట్లు కేటాయింపు. క్యాంటీన్ల రోజువారి నిర్వహణ వ్యయం రూ. 29 లక్షలు. నెలవారి ఖర్చు రూ. 9 కోట్లుగా ఉండనున్నట్లు ఆయన వెల్లడించారు.