న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో మహిళలపై అత్యాచారాల పర్వానికి తెరపడటం లేదు. లిఫ్ట్ ఇస్తామంటూ నలుగురు యువకులు ఓ మహిళను కారెక్కించుకొని తిరుగుతూ కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఢిల్లీ నగర శివార్లలోని తిమార్ పూర్ గ్రామం వద్ద జరిగింది. లిఫ్ట్ ఇస్తామంటూ నలుగురు యువకులు ఓ మహిళను కారులోకి ఎక్కించుకున్నారు. ఈ నలుగురూ ఆమెకు తెలిసిన వారే. ఆ తర్వాత ఢిల్లీ శివార్లలోని రోహిణి, ఉత్తర ఢిల్లీ ప్రాంతాల్లో కారును తిప్పుతూ, కారులోనే ఆమెపై అత్యాచారం జరిపారు. ఈ ఘటనతో ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం స్పృహలోకి వచ్చిన బాధిత మహిళ జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.