రాజధాని మార్చేందుకు కానీ, రెండు, మూడు రాజధానులుగా విభజించుటకు శాసనాధికారం లేదన్న హైకోర్టు (High Court) జడ్జిమెంట్పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాద రావు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వర్గాల మధ్య అధికారాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ (Assembly)ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు.రాజ్యాంగంలో డాక్ట్రిన్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ పేరుతో శాసన, న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థల పరిధిని స్పష్టంగా పేర్కొన్నారని లేఖలో వివరించారు.
శాసనాలను తయారు చేయడం, విధి విధానాలను రూపొందించడం శాసనసభ హక్కు అని అని, దానిని కాదనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. హైకోర్టు తీర్పులో శాసనసభ అధికారాలలోనూ, బాధ్యత నిర్వహణలోను న్యాయవ్యవస్థ జోక్యం చేసుకున్నట్టు అర్థమవుతోందన్నారు. శాసన, న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థల పరిధి, బాధ్యత, అధికారాలపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపర్చాలని ధర్మాన కోరారు.