ఉత్తరప్రదేశ్లోని షామ్లిలో పాఠశాలకు దగ్గర గల చక్కెర మిల్లు నుండి వెలువడిన వ్యర్థ రసాయనాలను పీల్చి దాదాపు 300మంది చిన్నారులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడకపోవడం, కడుపు నొప్పి, తల తిరగడం, కళ్ళు మండడం వంటి లక్షణాలతో సరస్వతి శిశు మందిర్కి చెందిన విద్యార్థులు బాధ పడుతుండడంతో వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్ళారు. వీరిలో దాదాపు 35మంది పరిస్థితి కొంచెం తీవ్రంగా వుండడంతో వారిని మీరట్లోని పెద్ద ఆస్పత్రికి తరలించారు. కాగా ఎవరికీ ప్రాణభయం లేదని డాక్టర్లు తెలిపారు. మిగిలినవారికి ప్రాథమిక చికిత్స చేసి పంపేశారు. మిల్లు నుండి వచ్చిన వ్యర్థాలను పాఠశాలకు దగ్గర్లోనే గల చెత్తకుప్పలో పడేస్తారని అదే ఈ పరిస్థితికి కారణమని పిల్లల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మంగళవారం పిల్లలు పాఠశాలకు వస్తుండగా ఫ్యాక్టరీ కార్మికులు ఆ చెత్తను తగలబెడుతుండడంతో దాన్నుండి విష వాయువులు వెలువడి ఈ పరిస్థితికి కారణమైంది.