ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. తొమ్మిదేళ్లు అన్యోన్యంగా కాపురం చేసింది. వారి పండంటి కాపురానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఏమైందో తెలియదు ఆ భర్త చనిపోయాడు. దీనిని తట్టుకోలేని ఆమె మూడు రోజులు భర్త శవంతోనే ఉండిపోయింది. దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూసి, అవాక్కయ్యారు. విషయాన్ని వెంటనే పోలీసులకు చేరవేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కర్నాటకలోని హుబ్లీ నవనగర ఎల్ఐజీ వద్ద మంజునాథ అబ్బిగెరె(30) అనే వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఆయన స్వస్థలం ధార్వాడలోని ఎత్తిన గుడ్డ ప్రాంతం. అయితే స్థానికంగా ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. గత మూడు రోజులుగా ఆ ఇంట్లోంచి ఎవరూ బయటకు రాలేదు. అప్పటికే ఆ ఇంటి నుంచి దుర్వాసన కూడా వస్తోంది. అనుమానంతో స్థానికులు గురువారం ఇంటికి వచ్చి చూశారు. విగతజీవిగా పడి ఉన్న మంజునాథను గమనించి, చనిపోయాడని నిర్ధారించుకున్నారు. విషయాన్ని పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి ఆ వ్యక్తి మూడు రోజుల క్రితమే కన్నుమూశాడని, కానీ భార్యపిల్లలు ఆ విషయం ఎవరికీ చెప్పలేదని తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే మంజునాథ మృతిపై అనుమానం ఉందని ఆయన తరుపు బంధువులు ఆరోపించారు. దీంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.