సాధారణంగా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలా మంది చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోతారు. తమ కళ్ల ముందు ఏదైనా ప్రమాదం జరిగితే సాయం చేయడం మాని, ఫొటోలు, వీడియోలు తీస్తారు. ఓ పక్క గాయాలతో ప్రాణాలు కోల్పోయే వారికి చేయందించడం మరిచిపోతారు. ఎదుటి వారి ప్రాణాలు కంటే తాము తీసే ఫొటోలే మిన్నగా భావిస్తుంటారు. ఇక నుంచి ఇలాంటి పనులు చేసే వారికి యూఏఈ ప్రభుత్వం గట్టి హెచ్చరికలు పంపింది. రోడ్డుపై ప్రాణాపాయంతో ఉన్న వారి వీడియోలను తీస్తే కఠినంగా శిక్షిస్తామని అక్కడి సర్కారు పేర్కొంది. ఇలా చేస్తూ పట్టుబడితే, ఆరు నెలల జైలు లేదా రూ. 31 లక్షల నుంచి రూ. కోటి వరకు జరిమానా విధిస్తామని చెప్పింది. కొన్ని సందర్భాల్లో రెండు శిక్షలను అమలు చేసే అవకాశం ఉందని వివరించింది. దీనికి సంబంధించి సైబర్ చట్టాన్ని సవరించారు. దీనిని జనవరి 2, 2022 నుంచే అమలులోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకోకుండా ఫొటోలు, వీడియోలు తీయడం నేరమేనని తెలిపింది. ఇక మార్ఫింగ్ చేస్తే తీవ్ర నేరంగా పరిగణించి, కఠిన శిక్షలు అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు జరిమానా విధించేలా చట్టాల్లో మార్పులు చేశారు.