ఉక్రెయిన్ దేశంలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై రష్యా సేనలు దాడులకు తెగబడ్డాయి. ఇది ఐరోపాలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రమని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. శుక్రవారం తెల్లవారుజామున రష్యా సైనికుల రాకెట్ దాడితో కేంద్రంలో మంటలు చెలరేగాయి. దీని నుంచి దట్టమైన పొగలు రావడం గమనించామని సమీప నగర మేయర్ వెల్లడించారు. దీనిని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా కూడా ధ్రువీకరించారు. అణు విద్యుత్ కేంద్రం వద్ద ఉక్రెయిన్ బలగాలకు, రష్యన్ సైనికులకు హోరాహోరీ పోరాటం సాగిందన్నారు. అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యా పేల్చివేస్తే పెను ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. దాడులు ఆపాలని రష్యా సేనలుక ఆయన పిలుపునిచ్చారు. ఆగ్నేయ ఉక్రెయిన్లోని పారిశ్రామిక నగరమైన జపోరిజ్జియా వద్ద ఈ అణు విద్యుత్ కేంద్రం ఉంది. ఉక్రెయిన్ దేశంలో 40 శాతం ప్రాంతానికి విద్యుత్ సరఫరా ఇక్కడ నుంచే అందుతోంది. తాజాగా ఇక్కడ జరిగిన ప్రమాదం మరింత పెద్దదైతే, చెర్నోబిల్ కంటే 10 రెట్లు ప్రభావం ఉంటుదనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.