కర్నూలు: రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తామని, పండ్ల ఎగుమతులను ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, విత్తనం సరిగా ఉంటేనే పంట బాగుంటుందని, విత్తనం బాగోలేకపోతే ఎన్ని ఎరువులు వేసినా వృథా అవుతాయని ఆయన వ్యాఖ్యానించారు. 60 శాతం విత్తనాలు లేబుల్ లేని విత్తనాలే వాడుతున్నామని, నాణ్యమైన విత్తనాలు లేక ఉత్పాదకశక్తి తక్కువగా ఉందన్నారు. నంద్యాల విత్తనోత్సత్తికి అనుకూల ప్రదేశమని, మెగాసీడ్ పార్క్లో 100 కంపెనీలు ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. విత్తనోత్పత్తిలో ఇప్పటి వరకు తమిళనాడు ముందుందని, రాబోయే రోజుల్లో ఏపీని నెం-1 స్థానంలో నిలబెడతామని బాబు స్పష్టంచేశారు. మార్కెట్లో పంటకు ధర తగ్గితే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు. జలసిరికి హారతి కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడుతున్నాయని చెప్పారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రావాలంటే.. కోల్డ్ స్టోరేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు రావాలన్నారు. 94 ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ కమిటీలు ఏర్పాటు చేశామని, వ్యవసాయంలో ఖర్చు తగ్గి ఆదాయం పెరగాలని చంద్రబాబు అన్నారు.