ఎప్పుడో జరిగిన ఘటనలపై సరైన సాక్ష్యాలు లేకుండా కేవలం ఇద్దరు మహిళలు చెప్పిన మాటలు నమ్మి, వైద్య పరమైన సాక్ష్యాలను చూపకుండా తనకు అన్యాయంగా 20 ఏళ్ల శిక్ష విధించారని, దాన్ని సస్పెండ్ చేయాలని కోరుతూ డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ వేసిన పిటిషన్ ను చండీగఢ్ హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ న్యాయస్థానం విచారించిన ఇచ్చిన తీర్పునే సమర్థిస్తూ, బాధిత మహిళల అభ్యర్థనను, సాక్ష్యాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నట్టు పేర్కొంది. గుర్మీత్ తరఫున వాదన వినిపించిన న్యాయవాది లేవనెత్తిన అంశాలతో కూడా కోర్టు అంగీకరించ లేదు. గుర్మీత్ శిక్షకు అర్హుడని, సాధ్వీలపై లైంగిక దాడులు చేసినట్టు నమ్మిన తరువాతనే కోర్టు ఈ శిక్షను విధించిందని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అందుకు తగ్గ సాక్ష్యాలను కూడా సీబీఐ సమర్పించిందని గుర్తు చేశారు.