అనంతపురం: పిఠాపురం పట్టణంలో మోహన్ నగర్ నందు హెల్త్ సెంటర్ నందు ఆదివారం ఎమ్మెల్యే పెండెం దొరబాబు పల్స్ పోలియో చుక్కల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. నేడు సమాజంలో పెరుగుతున్న అంగవైకల్య సమస్యలను దరి చేరనీయకుండా ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ 5 ఏళ్ల లోపు చిన్నారులను తప్పనిసరిగా టీకాలు వేయించాలని తెలిపారు. అందులో భాగంగానే నేడు పిఠాపురం పట్టణంతో పాటు రూరల్ మండలాల్లో కూడా పల్స్ పోలియో కేంద్రాలను వైద్య ఆరోగ్య సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు. పోలియో చుక్కలు వేయించేందుకు స్వచ్చందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, కమీషనర్ రామ్మోహన్ రావు, డాక్టర్ విజయ శేఖర్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.