మన దేశంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ ఉద్యోగం కోసం నిరుద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. ఒక్కో ఉద్యోగానికి వేల సంఖ్యలో ప్రస్తుతం పోటీ పడుతున్నారు. తీరా ఉద్యోగం వచ్చాక సమయానికి ఆఫీసులకు రావట్లేదనే అపప్రద వారిపై ఉంది. అయితే ఏ ప్రభుత్వమైనా ఉద్యోగుల పనితీరుపైనే ఆధార పడి ఉంటుంది. వారు బాగా పని చేస్తే ఆ ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు ఉంటుంది. అయితే ఉద్యోగులను తమ విధానాలకు అనుగుణంగా మలుచుకుని, పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఈ క్రమంలో ఏపీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ ఉద్యోగులు ఠంచనుగా సమయానికి డ్యూటీకి రావాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని సచివాలయ ఆర్థిక శాఖ అధికారులు నిర్ణీత సమయంలో కార్యాలయాలకు రావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ సమయానికి కార్యాలయానికి రాకుంటే సెలవు కింద పరిగణిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం 10:10 గంటలకు ముందే ఆఫీసుకు రావాలని, సాయంత్రం 5:30 గంటల వరకు తప్పని సరిగా విధులు నిర్వహించాలని సూచించింది. 11 గంటల లోపు ఆలస్యంగా వచ్చిన వారికి నెలలో మూడు సార్లు మాత్రమే వారి డ్యూటీని పరిగణిస్తామని, ఆ తర్వాత ఎప్పుడు లేట్గా వచ్చినా సెలవుగా హాజరు లెక్కిస్తామని పేర్కొంది.