టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇప్పుడు ఓ బాంబులాంటి వార్తను పేల్చారు. కరోనా అంతమైనా అలాంటి ముప్పు మరొకటి రానుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించిన గేట్స్.. కరోనా లాంటి ముప్పు మరొకటి తప్పదని డేంజర్ బెల్స్ మోగించారు. అయితే ఆ రానున్న ముప్పు కరోనా వైరస్ జాతి నుంచి కాకుండా ఇంకో వేరే రకమైన వైరస్ కారణంగా తలెత్తవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే ఇప్పటికే కరోనా కారణంగా మనలో విస్తృతంగా వృద్ధి చెందిన యాంటీబాడీలు, అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల కారణంగా ఆ కొత్త ముప్పు కరోనా అంతటి విలయాన్ని అయితే కల్పించే అవకాశాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కొత్త ముప్పు ప్రధానంగా వృద్ధులు, ఒబెసిటీతో బాధపడేవారు. డయాబెటిక్ రోగులపై పడనుందని కూడా ఆయన అంచనా వేశారు. ఇక వైద్య రంగంలో నానాటికీ అందుబాటులోకి వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కూడా ఈ కొత్త ముప్పును నిలువరించే అవకాశాలున్నాయని గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక కరోనా నివారణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ లక్ష్యాలపై స్పందించిన గేట్స్.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన 70 శాతం మందికి ఈ ఏడాది మధ్య నాటికి వ్యాక్సిన్ అందించే అవకాశాలు అయితే కనిపించడం లేదని సంచలన వ్యాఖ్య చేశారు.