వారిద్దరూ చక్కని విద్యావంతులు. అత్యున్నత సంస్థల్లో పనిచేసిన అనుభవం వారి సొంతం. అయితేనేం భారీగా డబ్బు సంపాదించాలన్న ఆశ వారి మదిలో పుట్టింది. అందుకు సులువైన మార్గం ఎంచుకున్నారు. హ్యాకింగ్ ద్వారా సుమారు రూ.27 వేల కోట్లు(3.6 బిలియన్ డాలర్లు) కొట్టేశారు. తమ గుట్టును బయటపడకుండా వ్యవహరిస్తూ, జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఐదేళ్ల తర్వాత పోలీసులకు పట్టుబడి కటకటాలు లెక్కపెడుతున్నారు. ప్రపంచాన్నే నివ్వెరబోయేలా చేసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
2016వ సంవత్సరంలో హాంకాంగ్ దేశంలో వర్చువల్ కరెన్సీ ఎక్స్ఛేంజి ‘బిట్ఫినెక్స్’ హ్యాకింగ్కు గురైంది. 1,19,754 బిట్కాయిన్లను దుండగులు చోరీ చేశారు. ఫలితంగా 3.6 బిలియన్ డాలర్ల విలువైన సంపదను గుర్తు తెలియని హ్యాకర్లు తమ ఖాతాల్లో వేసుకున్నారు. ఘటన జరిగిన ఐదేళ్ల తర్వాత కేసును పోలీసులు చేధించారు. నిందితులైన ఇలియా లిక్టెన్స్టెయిన్, హీథర్ మోర్గాన్ దంపతులను దోషులుగా నిర్ధారించి, అరెస్టు చేశారు. అంత పెద్ద మొత్తంలో దొంగిలించిన సొమ్మును వీరు కొంచెం, కొంచెం మాత్రమే ఖర్చు చేసేశారు. నిందితుడు ఇలియా లిక్టెన్స్టెయిన్ అమెరికా పౌరుడైనా, రష్యన్ పౌరసత్వాన్ని కూడా కలిగి ఉన్నాడు. తాను బ్లాక్ చెయిన్ సృష్టికర్తగా లింక్డ్ ఇన్లో పేర్కొన్నాడు. ఇక ఆయన భార్య హీథర్ మోర్గాన్ ఫోర్బ్స్లో, యూఎస్ ఐఎన్సీ పత్రికలోనూ కాలమిస్టుగా ఉండేవారు. ఎట్టకేలకు అమెరికా పోలీసులు వీరి చేతులకు గత వారం బేడీలు వేశారు.