కొన్ని వేల పాములను పట్టుకుని సురక్షితంగా వదిలేసిన టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ అదే పాము కాటుకు గురై ప్రాణాల కోసం పోరాడుతున్నాడు.ఆరు రోజుల క్రితం ఓ కాలేజీలో పామును పడుతుండగా పాముకాటుకు గురయ్యాడు. ఇప్పుడు భాస్కర్ నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.ఒకవైపు పాము కాటు.. మరోవైపు డెంగ్యూ కూడా సోకడంతో భాస్కర్ నాయుడు ఆరోగ్యం పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్లేట్ లెట్స్ తగ్గిపోవడంతో వైద్యులు భాస్కర్ నాయుడికి మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్పై భాస్కర్ నాయుడు చికిత్స పొందుతున్నారు. భాస్కర్ నాయుడు ఆరోగ్య పరిస్థతిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఎన్నో ఏళ్లుగా తిరుమల, తిరుపతిలో విష సర్పాల బారినుంచి భక్తులను భాస్కర్ నాయుడు కాపాడుతున్నాడు. టీటీడీ ఉద్యోగిగా పని చేస్తూనే భాస్కర్ నాయుడు ఇప్పటి వరకు 10వేల పాములకు పైగా పట్టుకున్నారు. రిటైర్ అయినప్పటికీ భాస్కర్ నాయుడు టీటీడీలో తన సేవలను కొనసాగిస్తున్నారు.
తిరుమలలో పాము కనిపించింది అని సమాచారం అందితే చాలు.. రంగంలోకి దిగిపోతాడు భాస్కర్ నాయుడు.. పెద్ద పాము అయినా, విషపూరితమైన ఏమాత్రం భయపడకుండా ఆ పామును అవలీలగా పట్టుకుంటాడు. అనంతరం ఆ పాములను సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేస్తాడు. తన చేతులతో వేలాది పాములను పట్టాడు.తిరుమల చుట్టుపక్కల ప్రాంతాల్లో భాస్కర్ నాయుడు పేరు తెలియని వారుండరు. ఎక్కడైనా పాము కనిపిస్తే చాలు.. స్థానికులకు ముందుగా గుర్తుకొచ్చే పేరు టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు. అలాంటి వ్యక్తి.. పాము కాటుకు గురయ్యాడు.
తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు కిడ్నీలో సమస్య రావడంతో వైద్యులు డయాలసిస్ చేశారు. కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. ఆస్నత్రిపాలైన భాస్కర్ నాయుడి ఆరోగ్యంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు.