ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గం పర్యటన సందర్భంగా శుక్రవారం రామాయణంపై తపాలా బిళ్లను ఆవిష్కరించనున్నారు. అక్కడి మానస్ మందిర్లో ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. తులసీదాస్ రచించిన రామచరిత్ మానస్ను మొత్తంగా పాల రాళ్లపై చెక్కించి గోడలకు అమర్చి ఉంచడం ఈ మందిరం ప్రత్యేకత. తపాల బిళ్లలో రామాయణానికి సంబంధించిన మొత్తం 11 చిత్రాలు ఉంటాయి. సీతా స్వయంవరం, శృంగవేల్పుర్ ఘాట్ (ప్రస్తుత అలహాబాద్) వద్ద సీతారామలక్ష్మణులు గంగను దాటడం, రాముడు చిత్రకూట్లో తన తమ్ముడు భరతున్ని కలవడం, జటాయువుతో సంభాషణ, శబరి ఇచ్చే పళ్లను తినడం, అశోక వనంలో హనుమంతుడు సీతను కలవడం, హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకురావడం, రావణుని వధ, శ్రీరామ పట్టాభిషేకం వంటి చిత్రాలు ఉన్నాయి. దీని ధర రూ.65. ప్రధాని విడుదల చేసిన అనంతరం దేశంలోని అన్ని తపాల కార్యాలయాల్లో లభ్యమవుతాయి.
అనంతరం వారణాసి-వడోదరా మధ్య నడిచే మహామన ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. బెనారస్ హిందు విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడు పండిట్ మదన్ మోహన్ మాలవీయ బిరుదైన ‘మహామన’ను ఈ రైలుకు పేరుగా పెట్టారు. ఆవుకు చేసే శస్త్రచికిత్సను చూడనున్న మోదీ: పర్యటనలో భాగంగా రెండో రోజైన శనివారం వ్యాధిగ్రస్థ ఆవుకు జరిగే శస్త్రచికిత్సను తొలిసారిగా ప్రధాని స్వయంగా చూడనున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు తిన్న ఆవుకు ఈ చికిత్స జరగనుంది. ఇందుకోసం భారత పశువైద్య పరిశోధన సంస్థ వారణాసిలో ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్ను ఏర్పాటు చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాలను తిని ఆవులు ఎలా రోగాల బారిన పడుతున్నాయో స్వయంగా తెలుసుకోవాలని ప్రధాని ఆసక్తి చూపడంతో ఈ ఏర్పాటు చేశారు. అనంతరం షాజహాన్పూర్లోని గంగా-తిరి జాతి గోవుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శిస్తారు. అక్కడ గోపూజ చేస్తారు. ఈ జాతి గోవులు కేవలం గంగా తీరంలోనే కనిపిస్తాయి. 1950లో ఇక్కడ గో సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు.