కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులకు జనవరి నెల జీతాలు అందుతాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పీఆర్సీ వ్యవహారం, ఉద్యోగుల సమస్యలపై సజ్జల చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల ఆందోళనలకు యూనియన్ నాయకుల మూడు డిమాండ్లకు సంబంధం లేదన్నారు. హెచ్ఆర్ఏ సవరణ అంశాన్ని కార్మిక సంఘాలు ప్రస్తావించడం లేదన్నారు. ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీతో చర్చలకు వస్తే పాత జీతాలు వసూలు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని సజ్జల తెలిపారు. కొత్త పేస్కేళ్లతో వేతన బిల్లులు రూపొందించే డీడీఓలను పని చేయకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. ఆర్థిక సమస్యల కారణంగా ఒకటి, రెండు అంశాలపై దృష్టి సారించాలని సంఘాలకు ముందే చెప్పినట్లు తెలిపారు. ప్రాధాన్యత దృష్ట్యా ఫిట్ మెంట్ పై నిర్ణయమే కీలకమని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇప్పుడు మాట మార్చి మరోలా వ్యవహరించడం సరికాదని సజ్జల అన్నారు.