కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కేసులు నమోదు అవుతున్నా ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉన్నవారి సంఖ్య చాలా స్వల్పంగా ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. ఆస్పత్రుల్లో చేరుతున్నవారు కూడా దాదాపు చికిత్సతో కోలుకుంటున్నారని వివరించారు. క్రమంగా పాజిటివిటీ రేటు కూడా తగ్గుముఖం పడుతున్నాయని సంకేతాలు కనిపిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. 1.06లక్షలకుపైగా కేసుల్లో కేవలం 2709 మందే ఆస్పత్రుల్లో చేరారని అధికారులు వెల్లడించారు. ఇందులో ఐసీయూలో చేరిన వారు కేవలం 287 మంది మాత్రమేనని తెలిపారు. 18 ఏళ్ల పైబడ్డ 90.34 శాతం మందికి రెండు డోసుల వాక్సినేషన్ పూర్తయ్యిందన్న అధికారులు సీఎంకు వివరించారు. అన్నిజిల్లాల్లో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. కోవిడ్ కేర్ సెంటర్లలో ఉన్నవారికి మంచి సదుపాయాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆస్పత్రుల్లో చేరుతున్నవారికి అర్హులైన వారు అందరికీ కూడా ఆరోగ్యశ్రీ కింద చికిత్స పూర్తిస్థాయిలో అందిచాలన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ అమలు తీరు దేశం మొత్తం మాట్లాడుకునేలా ఉండాలని సూచించారు. కోవిడ్ చికిత్సలో భాగంగా అనుసరించాల్సిన విధానాలపై ఎప్పటికప్పుడు అడ్వైజరీస్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బీమా సంస్థలు రేట్లకన్నా.. ఆరోగ్యశ్రీ కింద చికిత్సలకు మంచి రేట్లు చెల్లిస్తున్నామని సీఎం చెప్పారు.