దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనా కట్టడికి రాష్ట్రంలో వీకెండ్ కర్ఫ్యూను విధించడంతోపాటు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తోంది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ ను ఎత్తేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఆంక్షలను సడలిస్తోంది. ఈ సందర్భంగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్కెట్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లను ఓపెన్ చేసుకోవచ్చని సూచించింది. అయితే 50 శాతం కెపాసిటీతో మాత్రమే నిర్వహించుకోవాలని ఆదేశించింది. పెళ్లిళ్లకు హాజరయ్యే వారి సంఖ్యను కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకుముందు కేవలం 20 మందితో మాత్రమే శుభకార్యాలు నిర్వహించుకోవాలని నిబంధన విధించగా ఇప్పుడు 200 మంది వరకూ హాజరు కావొచ్చని మార్గదర్శకాల్లో తెలిపింది. అయితే నైట్ కర్ఫ్యూ మాత్రం ఢిల్లీలో అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ యథావిధిగానే అమలవుతుందని ప్రభుత్వం పేర్కొంది.