గుడివాడ వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తదితర నేతలను కృష్ణా జిల్లా పోలీసులు నందమూరు వద్ద అడ్డుకున్నారు. అయితే వాహనాలు దిగి కాలినడకన బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు కలవపాముల వద్ద మరోసారి అడ్డుకున్నారు. వారిని బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలావుంటే బీజేపీ నేతలు దాదాపు మూడు కిలోమీటర్ల మేర పోలీసు వలయాలను ఛేదించుకుని నడిచారు. దాంతో పోలీసులు అదనపు బలగాలను పిలిపించి సదరు నేతలను తరలించారు. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో శాంతిభద్రతలను కారణంగా చూపుతూ తమను పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామని, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు తమను అడ్డుకోవడమేంటని బీజేపీ నేతలు మండిపడ్డారు.