ఇటీవల సంభవించిన భూకంపం, తుపానుకు గురై భారీగా నష్టపోయిన మెక్సికోపై పదిహేను రోజుల్లోనే మరో విపత్తు విరుచుకుపడింది. అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం.. మెక్సికోను భారీ భూకంపం కుదిపేసింది. భూకంపం సంభవించడంతో ఇళ్లు, కార్యాలయాల్లోని నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. వందలాది మంది సజీవ సమాధి అయ్యారు. మట్టిముద్దగా మెక్సికో సిటీ మారింది. మధ్య మెక్సికోలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. దక్షిణ మెక్సికోలో 7.4గా నమోదైంది. భూకంప ధాటికి అనేక ఇండ్లు, భవనాలు నేలమట్టం అయ్యాయి. 138 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద పదుల సంఖ్యలో చిక్కుకుని ఉంటారని సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
భూకంపం ధాటికి క్యూయెర్నవాకా ప్రాంతంలోని పాఠశాల భవనం కుప్పకూలిపోయింది. స్కూల్లోని విద్యార్థులు, అధ్యాపకుల ఆచూకీ తెలియరాలేదు. కాండెసా ప్రాంతంలోని ఐదంస్థుల భవనం నేలమట్టం అయింది. భూకంప ధాటికి ప్రాణ, ఆస్తి నష్టం భారీగా ఉండే అవకాశం ఉందని అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. భూకంపం వల్ల గ్యాస్ పైపులైన్లు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మెక్సికోకు అన్ని విధాలా అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భరోసానిచ్చారు. 1985 సెప్టెంబర్ 19న మెక్సికోపై పెను భూకంపం విరుచుకుపడింది. నాడు 10 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 32 ఏళ్ల తర్వాత సరిగ్గా అదేరోజు మరోసారి భూకంపం సంభవించింది. భూకంపం వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అప్రమత్తం చేసిన కొన్ని గంటల్లోనే విపత్తు విరుచుకుపడింది.