మహారాష్ట్రలోని షుగర్ ఫ్యాక్టరీల అమ్మకాలలో అవినీతి జరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్షాకు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే లేఖ రాశారు. దాదాపు రూ.25,000 కోట్ల అవకతవకలు జరిగాయని ఆయన ఆ లేఖలో ఆరోపించారు. దీనిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, విచారణ జరిపించాలని ఆయన కోరారు. ఆ ఫ్యాక్టరీలకు ప్రైవేటు సంస్థలకు అమ్మడంలో రాజకీయ నేతలతో పాటు ప్రభుత్వ అధికారుల పాత్ర ఉందని అన్నారు. నిష్పాక్షికంగా దీనిపై దర్యాప్తు జరపాలని ఆయన కోరారు. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు కేంద్ర సర్కారు ప్రయత్నించినప్పటికీ 47 షుగర్ ఫ్యాక్టరీలను ప్రైవేటు సంస్థలకు విక్రయించారని ఆయన అన్నారు. అక్రమ రుణాల వల్లే షుగర్ ఫ్యాక్టరీలు దెబ్బతిన్నాయని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే తక్కువ ధరలకే వాటిని అమ్మేశారని అన్నారు. కాగా, మహారాష్ట్రంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్న విషయం తెలిసిందే.